Times Now Survey: సర్వేను వండి వార్చిన టైమ్స్ నౌ..! మరీ ఇంత దారుణమా?

అబద్దం చెబితే అతికినట్లు చెప్పాలి. అదే నిజం అనిపించేలా ఉండాలి. కానీ జనం నవ్వుకునేలా చెబితే ఎలా..? టైమ్స్ నౌ తాజా సర్వే అలాగే నవ్వులపాలైంది. ఏపీలో దాదాపు అన్ని లోక్‌సభ సీట్లు వైసీపీ గెలుస్తుందట. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కష్టమని వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇప్పుడా వైసీపీ కూడా నమ్మలేని సర్వే ప్రకటించి నవ్వులపాలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2023 | 01:30 PMLast Updated on: Apr 22, 2023 | 1:30 PM

Times Now Etg Cooked Survey

అబద్దం చెబితే అతికినట్లు చెప్పాలి. అదే నిజం అనిపించేలా ఉండాలి. కానీ జనం నవ్వుకునేలా చెబితే ఎలా..? టైమ్స్ నౌ తాజా సర్వే అలాగే నవ్వులపాలైంది. ఏపీలో దాదాపు అన్ని లోక్‌సభ సీట్లు వైసీపీ గెలుస్తుందట. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కష్టమని వైసీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇప్పుడా వైసీపీ కూడా నమ్మలేని సర్వే ప్రకటించి నవ్వులపాలైంది. ఎంత పేమెంట్ అందితే మాత్రం మరీ అంత అడ్డగోలుగా చెప్పాలా…! జనం నోటితో కాదు.. దేంతో నవ్వుతారో ఊహించుకోండి.

దేశంలో తాజా రాజకీయ పరిస్థితిపై టైమ్స్ నౌ సర్వే చేసింది. దేశవ్యాప్తంగా చూస్తే ప్రధాని మోడీహవా నడుస్తుందని మరోసారి కమలం సర్కార్ గ్యారెంటీ అని తేల్చిచెప్పింది. దేశంలో రాజకీయ పరిస్థితిని చూస్తే అంతవరకు ఓకే… దేశవ్యాప్తంగా బీజేపీకి 292-338 సీట్లు వస్తాయని తేల్చింది. కాంగ్రెస్ 106-144 సీట్లు, వైసీపీ 24-25, టీఎంసీ 20-22, ఇతరులు 50-80 సీట్లు గెలుచుకుంటారని లెక్కగట్టిది.

దేశంలో మళ్లీ బీజేపీ సర్కార్ వస్తుందని చెప్పింది… ఓకే.. కానీ ఏపీ దగ్గరకు వచ్చేసరికి పప్పులో కాలేసింది. ఎంత పేమెంట్ అందిందో కానీ అడ్డగోలు ఫలితాలు ప్రకటించింది. ఏపీలో 25 లోక్‌సభ సీట్లుంటే అందులో కనీసం 24సీట్లు వైసీపీ గెలుచుకుంటుందట. ఆ మిగిలిన సీటు కూడా… అంటే మొత్తం సీట్లు వైసీపీ ఖాతాలోకే చేరొచ్చని కూడా చెప్పుకొచ్చింది. మరీ ఇంత బూతా…? ఈ సర్వే చూసిన చిన్నపిల్లలకు కూడా ఇది వండి వార్చిన స్టోరీ అని కూడా అర్థమవుతుంది. మేమే ప్రభంజనం సృష్టిస్తామని చెప్పుకోవడానికి వైసీపీ చేయించిన ఫేక్ సర్వేగా తెలుస్తోంది. వైసీపీకి మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పుకోవచ్చు… లేదా 15-20సీట్లు వస్తాయంటే ఏమోలే అనుకోవచ్చు. కానీ మరీ ఇంత గుడ్డిగా అడ్డగోలుగా సర్వేలు ప్రకటించేసి టైమ్స్ నౌ తన క్రెడిబులిటీని ఎందుకు పోగొట్టుకుంటుందో….! పోనీ పరపతిపోయినా పర్లేదనుకునే స్థాయిలో ప్రయోజనాలు చేకూరాయేమో…!

ఏపీలో వైసీపీ పరిస్థితి బాగాలోదేన్నది అందరికీ తెలిసిందే. ఆ పార్టీ నేతలే ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ టైమ్స్ నౌ మాత్రం ఏపీ ప్రజల మనసులోకి దూరి చూసేసినట్లు సర్వే ప్రకటించింది. 2019లో జగన్ బూమ్‌లో కూడా టీడీపీ మూడు ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు ఆ పార్టీ గతంతో పోల్చితే మెరుగైంది. వైసీపీ ప్రభ తగ్గుతుంటే టీడీపీ గ్రాఫ్ పెరుగుతోందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అసలు ఏపీలో రాజకీయాలు మారిపోతున్నాయి. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఓపెన్‌గానే ఉంది. బీజేపీని కూడా కలుపుకు పోవాలని చూస్తున్నా కమలనాథులు కలసిరావడం లేదు. జగన్‌ని ఇప్పుడు ఓడించలేకపోతే పార్టీ మనుగడ కష్టమని టీడీపీకి తెలుసు. అందుకే సర్వశక్తులు ఒడ్డుతోంది. జనసేనదీ అదే పరిస్థితి. టీడీపీతో కాకుండా సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు వస్తాయో ఆ పార్టీ ఊహించగలదు. మరోసారి నవ్వులపాలు కాకూడదని పవన్ గట్టిగా ఉన్నారు. అవసరమైతే బీజేపీతో ఆ బంధం తెంచుకోవాలన్నది జనసేనాని ఆలోచన. ఇప్పుడు ఎన్నో కొన్ని సీట్లో గెలవకపోతే ప్రజల్లోనే కాదు కాపు కులంలో కూడా పరపతి పోతుందని పవన్‌కు తెలుసు. అందుకే పవన్ పొత్తుకోసం పాకులాడుతున్నారు. ఈ రెండు పార్టీలు గెలిస్తే తమకు ముప్పని వైసీపీకి కూడా తెలుసు. అందుకే ఆ రెండు కలవకుండా ఢిల్లీ స్థాయిలోనూ ఒత్తిడి తెస్తోంది. బీజేపీ ప్రభావం నామమాత్రమే. లెఫ్ట్ పార్టీలు కూడా టీడీపీవైపే మొగ్గుచూపుతున్నాయి. మొత్తంగా చూస్తే ప్రతిపక్షాలన్నీ దాదాపు ఏకమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఒకవేళ జనసేన-టీడీపీ కలవవు అనుకుందాం. టీడీపీ పరిస్థితి గతంలో కంటే మెరుగైందన్నది అందరికీ తెలిసిందే. జనసేనాని కలసిరాకపోయినా టీడీపీ గతంలో కంటే మెరుగైన సీట్లు సాధించే అవకాశం ఉంది. వైసీపీకి ఇది లాభమే అయినా గంపగుత్తగా అన్ని లోక్‌సభ సీట్లు తన ఖాతాలో వేసుకునే అవకాశం లేదు. ఇది బహిరంగ రహస్యమే. టైమ్స్ నౌకు ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కనిపించలేదో అర్థం కావడం లేదు. ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారపార్టీకి పరాజయం ఎదురైంది. ఆ ఫలితాల తర్వాత ఓ సెక్షన్ ఆఫ్ ఓటర్లలో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమేనని వైసీపీ పెద్దలే అంగీకరించారు. మరి ఇదంతా టైమ్స్ నౌకు కనిపించలేదా…? ఉద్యోగుల్లో వ్యతిరేకత బహిరంగ రహస్యమే… దాన్ని వదిలేశారా…? మేం మళ్లీ గెలవబోతున్నాం అంటూ వైసీపీ నేతలు డాంబికాలు పలకడానికి తప్ప మరి దేనికీ ఈ సర్వే పనికిరాదనే చెప్పుకోవాలి.

జగన్ మీట నొక్కి డబ్పులేస్తున్నానని చెబుతున్నా… ఎంతమందికి పడుతున్నాయన్నది అనుమానమే. ఏపీలో అభివృద్ధి ఎక్కడుందో చెప్పమంటే భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. రాజధాని ఏదో కూడా చెప్పలేని పరిస్థితి. రోడ్లులేవు… చెత్త పన్ను పేరుతో నడ్డి విరుస్తున్నారు. దొడ్డిదారిన కరెంట్ చార్జీలు పెంచేశారు. మందుబాబుల జేబులకు కాస్త గట్టిగానే చిల్లు పెడుతున్నారు. చిన్న చిన్న పనులు కూడా ఎమ్మెల్యేలు చేయించలేకపోతున్నారు. గడప గడపకు కార్యక్రమంలో అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఖజానాలో సొమ్ముల్లేవు… ఉద్యోగులకు నెలనెలా ఏ రోజు జీతాలు ఫడతాయో ప్రభుత్వ పెద్దలకే ఫజిల్.. అుటు రైతుకు పంట సొమ్ము ఎప్పుడు అందుతుందో తెలియదు… ఇక ఏపీకి వరం కావాల్సిన పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో మంత్రిగారే చెప్పలేకపోతున్నారు. వీటన్నింటికీ తోడు ఇటీవలి వివేకా కేసు పరిణామాలు వైసీపీకి శాపంగానే మారుతున్నాయి. మరి వీటన్నింటినీ టైమ్స్ నౌ పరిగణలోకి తీసుకోలేదా…? ఇన్ని సమస్యలు, ఇంత వ్యతిరేకత కనిపించలేదా…? లేక జగన్ ఓటర్లను కూడా డబ్బులు వెదజల్లి కొనేస్తారని లెక్కగట్టి ఈ ఫలితాలు ప్రకటించిందా…? అసలు జనంలో తిరిగి సర్వే చేసిందా..? ఇవన్నీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అంటూ చెప్పుకొచ్చింది టైమ్స్ నౌ. మరి ఇప్పటికే ఇన్ని సమస్యలున్నాయి కదా. అంటే జనం వాటిని పట్టించుకోరనుకుందా..?

ఈ సర్వే చూసిన చాలామందికి మొదట వచ్చిన అనుమానం… ఇవి గత ఎన్నికల ముందు చేసిన సర్వే ఫలితాలేమోనని…! ఎందుకంటే కాస్త అటూ ఇటుగా అలాగే కనిపిస్తున్నాయి. జనంలో తమ పరపతి తగ్గలేదని చెప్పుకునేందుకు అప్పుడప్పుడు పార్టీలు ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతుంటాయి. కోట్లు కుమ్మరించి తమకు కావాల్సిన విధంగా సర్వేలు చేపించుకుంటాయి. వాటిని జనానికి చూపించి మళ్లీ మేమే వస్తామని చెప్పుకుంటాయి. కానీ అందులోనూ వాస్తవాలను కాస్తో కూస్తో తొక్కిపడతాయి. కానీ ఇక్కడ టైమ్స్ నౌ మాత్రం పూర్తిగా వాస్తవాలను తొక్కిపట్టినట్లే కనిపిస్తోంది. కనీసం జనం నమ్మేలా చెబితే దాని క్రెడిబులిటీ ఉండేదేమో…
( వైసీపీకి మెజారిటీ సీట్లు రావనో లేక టీడీపీ గెలుస్తుందనో మేం చెప్పడం లేదు. కానీ వాస్తవాలను కళ్లకు కట్టేలా నిజాలు రాస్తే బాగుండేదనే చెబుతున్నాం..)