DSC Notification: డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 6,500 పోస్టుల భర్తీ..!

మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. 6,500 పోస్టులకుపైగా భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యలో మొత్తం 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 24, 2023 | 03:03 PMLast Updated on: Aug 24, 2023 | 3:03 PM

Ts Dsc Notification Will Be Released Soon Says Sabitha Indra Reddy

DSC Notification: ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. టీచర్ పోస్టుల భర్తీకి శనివారంలోపు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ అంశంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. 6,500 పోస్టులకుపైగా భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

పాఠశాల విద్యలో మొత్తం 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి టీఎస్‌పీఎస్‌సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేస్తామని చెప్పారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి శనివారంలోపు నోటిఫికేషన్‌, విధివిధానాలను విడుదల చేస్తామన్నారు. జిల్లాల వారీగా రెండు రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తారన్నారు. చాలా కాలంగా బీఈడీ, టీటీసీ వంటి కోర్సులు పూర్తి చేసిన యువత ఉద్యోగాల భర్తీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం దృష్టిసారించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తెలంగాణలో విద్యారంగంపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. “కార్పొరేట్‌ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. గురుకుల విద్యాలయాల్లో అందరూ గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేశాం.

ఇదివరకే గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాం. ఇప్పటికే 5,310 టీచర్‌ పోస్టులు భర్తీ చేశాం. కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ఇప్పటికే క్రమబద్ధీకరించాం. తెలంగాణలోని అన్ని స్థాయుల్లో ప్రభుత్వ విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నాం. ఇంటర్‌, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాం” అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నిరుద్యోగుల్ని ఆకట్టుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తూ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టింది.