8 మంది నిందితుల్లో.. ఒక్కరికే ఉరి శిక్ష ఎందుకు ?

తెలంగాణలో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 11, 2025 | 05:20 PMLast Updated on: Mar 11, 2025 | 5:20 PM

Why Was Only One Of The 8 Accused Sentenced To Death

తెలంగాణలో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గత ఏడేళ్లుగా కేసు నడుస్తుండగా.. సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పు వెలువరించింది. కేసులో A2 నిందితుడిగా ఉనన్న సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష ఖరారు చేశారు. మిగిలిన నిందితులకు న్యాయస్థానం జీవితఖైదు విధించింది. ప్రణయ్‌ హత్య కేసులో A1 నిందితుడు మారుతీరావు ఉండగా.. 2020లో అతడు సూసైడ్ చేసుకున్నాడు. A2 సుభాష్‌ కుమార్‌ శర్మ, A3 అస్గర్‌అలీ, A4 బారీ, A5 కరీం, A6 శ్రవణ్‌ కుమార్, A7 శివ, A8 నిజాంలు నిందితులుగా ఉన్నారు. వీరిలో సుభాష్‌శర్మకు బెయిల్‌ రాకపోవడంతో ప్రస్తుతం జైలులోనే ఉన్నాడు. అస్గల్‌ అలీ మరో కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

మిగిలిన వారందరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. తాజాగా న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. సుభాష్ కుమార్ శర్మకు ఉరిశిక్ష మిగిలిన నిందితులకు జీవితఖైదు విధించింది. తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు 2018 సెప్టెంబర్‌ 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను ఆస్పత్రికి తీసుకువెళ్లి.. తిరిగి వస్తుండగా దుండగులు ప్రణయ్‌పై దాడి చేసి చంపేశారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుఫారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను మారుతీ రావు దారుణంగా హత్య చేయించాడు. ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి, అమృత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు.

అప్పటి నల్గొండ ఎస్పీ ఏవీ రంగనాథ్‌ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం విచారణ పూర్తిచేసి ప్రణయ్ హత్యకేసుల్లో మెుత్తం ఎనిమిది మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించింది. 2019 జూన్‌ 12న చార్జిషీట్‌ దాఖలు చేయగా.. నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ సెషన్‌ కోర్టు విచారణ ప్రారంభించింది. రోజువారీగా మెుత్తం 102 మందిని విచారించింది. పోలీసులు సమర్పించిన చార్జిషీట్‌ నివేదిక, పోస్టుమార్టం రిపోర్టు, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌లతోపాటుగా సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును నేటికి రిజర్వు చేసింది. ప్రణయ్‌ హత్యకేసులో ఏ1గా ఉన్న మారుతీ రావు 2020లో హైదరాబాద్‌లోని ఓ లాడ్జిలో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఏ2 నిందితుడు, బీహార్‌కు చెందిన సుభాష్‌శర్మకు తాజాగా కోర్టు ఉరిశిక్ష విధించింది. మారుతీ రావు బాబాయ్ శ్రవణ్ కుమార్ ఏ6గా ఉండగా.. అతడితో పాటు మిగిలిన ఐదుగురికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. కోర్టు తీర్పు పట్ల ప్రణయ్‌ కుటుంబం భావోద్వేగం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు న్యాయం గెలిచిందని ప్రణయ్‌ తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన కొడుకు సమాధి వద్ద నివాళులర్పించాడు. ఇక జీవితఖైదు పడ్డ శ్రవణ్‌ రావు కుటుంబ సభ్యులు అమృతపై తీవ్ర ఆరోపణలు చేశారు. అమృత వల్లే తాము నాశనమైపోయామంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత వచ్చిన ఈ తీర్పుపై మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.