YS JAGAN: విశాఖ రాజధాని పేరుతో వైఎస్ జగన్ సెల్ఫ్‌గోల్..? వైసీపీ నేతల్లో టెన్షన్

అసలు మూడు రాజధానుల అంశమే పార్టీ కొంపముంచిందని.. విశాఖను రాజధాని చేయడం కోసం జగన్ ఆడిన డ్రామా అని.. విజయసాయిరెడ్డి చేసిన అరాచకంతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో వైసిపి బాగా దెబ్బతిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2024 | 08:29 PMLast Updated on: Mar 05, 2024 | 8:29 PM

Ys Jagan Self Goal About Saying Visakhapatnam As Ap Capital

YS JAGAN: ఎన్నికల ముందు ఏపీ ముఖ్యమంత్రి ఏం చేయకూడదో అదే చేశాడు. ఎవరు ఎన్ని అన్నా.. ఏమన్నా.. విశాఖ ఆంధ్రప్రదేశ్ రాజధాని అని.. మళ్లీ గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం విశాఖలోనే చేస్తానని ప్రకటించారు జగన్. దీంతో వైసీపీలో ఒక్కసారిగా పెద్ద ఉలికిపాటు వచ్చింది. అసలు మూడు రాజధానుల అంశమే పార్టీ కొంపముంచిందని.. విశాఖను రాజధాని చేయడం కోసం జగన్ ఆడిన డ్రామా అని.. విజయసాయిరెడ్డి చేసిన అరాచకంతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో వైసిపి బాగా దెబ్బతిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

CHANDRABABU NAIDU: బాబు సొంత జిల్లాలో టీడీపీ పరిస్థితేంటి..? ఈసారి క్లీన్ స్వీప్ ఖాయమా..?

విశాఖ ఏపీ రాజధాని అనే విషయాన్ని ప్రస్తావించకుండా ఉంటే ఏదో రకంగా బయటపడి పోతామని.. వైసిపి నాయకులు, కార్యకర్తలు మనసులో వేయి దేవుళ్లకు దండం పెట్టుకున్న పరిస్థితుల్లో.. విశాఖ వచ్చిన ఏపీ సీఎం జగన్ హఠాత్తుగా రాజధాని అంశాన్ని మళ్లీ పైకి లేపారు. తన మొండి వాదనను కొనసాగిస్తూ విశాఖ ఏపీ రాజధాని.. రెండోసారి తన పదవి స్వీకార ప్రమాణం విశాఖలోనే అంటూ ప్రకటించేశారు. ఈ వ్యాఖ్యలతో విశాఖను రాజధానిగా ప్రస్తావిస్తూ జగన్ సెల్ఫ్ కోల్ చేసుకున్నారని చాలామంది భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా విజయసాయిరెడ్డి కాలు పెట్టిన దగ్గరనుంచి జరిగిన అరాచకాలు అన్ని ఇన్ని కావు. 200 గజాల స్థలం ఉన్న సాదాసీదా మధ్యతరగతి వ్యక్తిని కూడా విజయసాయిరెడ్డి అండ్ బ్యాచ్ వణికించేశారు. కడప, అనంతపురం, కర్నూలు చిత్తూరు నుంచి విశాఖలో దిగిన రెడ్లు భూ కబ్జాలతో విశాఖను అల్లాడించారు. ఉత్తరాంధ్ర స్థానిక వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు లాంటి వాళ్ళని పూర్తిగా మూల కూర్చోబెట్టారు. విశాఖ రియల్ ఎస్టేట్‌పై సాయి రెడ్డి కన్ను పడింది. సాయిరెడ్డి ఆధ్వర్యంలో గడచిన నాలుగేళ్లలో విశాఖలో జరిగిన దారుణాలు అన్ని ఇన్ని కావు. దీనికి తోడు బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాస్ రావు అలియాస్ డాన్ శీను, ప్రముఖ ఆడిటర్ జీవి, విశాఖ ఎంపీ ఎంవిపి వీళ్లంతా సాయి రెడ్డితో కలిసి ఉత్తరాంధ్ర వెన్నులో వణుకు పుట్టించారు.

YSRCP: ఆ జిల్లాలో ఒక్కర్నీ మార్చని వైసీపీ.. కారణం ఇదేనా..?

విజయసాయిరెడ్డి దాదాపు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిలాగే వ్యవహరించారు. సాధారణ జనాలకు కూడా వాళ్ల ఇళ్ల స్థలాలు ఏమైపోతాయా అనే భయాన్ని కలిగించారు. విశాఖలో ల్యాండ్ కబ్జాలు, రియల్ ఎస్టేట్ మర్డర్లు పెరిగాయి. దీంతో ఉత్తరాంధ్రలో వైసిపిపై విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. విశాఖ రాజధాని పేరుతో రెడ్లు ఉత్తరాంధ్రను కబ్జా పెట్టారని జనం మాట్లాడుకుంటున్నారు. జరిగిన డ్యామేజీని ఆలస్యంగా గుర్తించిన జగన్ మోహన్ రెడ్డి రీజినల్ కోఆర్డినేటర్ పదవి నుంచి విజయసాయి రెడ్డిని తప్పించి అమరావతికి తీసుకెళ్లిపోయారు. సాయిరెడ్డి వెళ్లిపోయినా.. జరిగిన డ్యామేజ్ మాత్రం అలాగే ఉంది. ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం 10, విజయనగరం 9, విశాఖ జిల్లా 15. ఈ మొత్తం 34 సీట్లలో కనీసం 25 స్థానాల్లో వైసిపి తుడిచిపెట్టుకుపోతుందని సర్వేలు చెబుతున్నాయి. అసలు రాజధానిపై ఉత్తరాంధ్ర సామాన్య జనంలో ఆసక్తి కూడా లేదు. ఈ రాజధాని వల్లే ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో క్రైమ్ రేట్ పెరిగిందని, కమ్మ వాళ్లతో పాటు, ఇప్పుడు రెడ్ల ఆధిపత్యం కూడా పెరిగిందని అక్కడ జనం భావిస్తున్నారు. ఈ రాజధాని గొడవ మనకెందుకంటూ గగ్గోలు పెడుతున్నారు. నిజానికి విశాఖ మొదటి నుంచి స్థానికేతరుల చేతుల్లోనే విలవిలలాడుతోంది.

Arvind Dharmapuri: అర్వింద్ వర్సెస్ కాంగ్రెస్.. షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ రాజకీయం..

ఇప్పటివరకు విశాఖ ఆర్థిక వ్యవస్థని కమ్మ సామాజిక వర్గం కంట్రోల్ చేస్తుంటే, గడచిన నాలుగేళ్లుగా రెడ్ల ఆధిపత్యం నడుస్తోంది. స్థానికంగా ఉండే బీసీలు కానీ, ఇతర కులాలుగాని భయంతో వణికి పోతున్నాయి. పోనీ రాజధాని పేరుతో విశాఖను ఏమైనా అభివృద్ధి చేశారా అంటే.. అదీ లేదు. ఒక్క ఐటీ కంపెనీ కూడా తీసుకురాలేకపోయారు. పట్టుమని వెయ్యి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఉన్న విద్యా సంస్థల్ని వసూళ్ల పేరుతో అల్లాడించేశారు. విశాఖ ఎంపీ ఎం వివి సత్యనారాయణ నామ్‌కి వాస్తే ఎంపి. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికి అతను ఎంపీ అయ్యాడు. ఆ పని పూర్తి చేసుకున్నాడు. తర్వాత ఎప్పుడు పారిపోదామా అని చూస్తున్నాడు. ఒక రౌడీల ముఠా ఎంపీ భార్యను, కొడుకుని కిడ్నాప్ చేసే పరిస్థితి విశాఖలో వచ్చిందంటే రాజధాని పుణ్యమా అని ఎంత క్రైమ్ రేట్ పెరిగిందో అర్థం అవుతుంది. అయినా సరే.. జనానికి ఇష్టం ఉన్నా, లేకపోయినా.. మొండిగా విశాఖను రాజధాని చేసి.. అమరావతిలో కమ్మవాళ్లను చావు దెబ్బ కొట్టాలని, విశాఖలో ఆర్థికంగా రెడ్ల ఆధిపత్యాన్ని పెంచాలని ఏపీ సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే విశాఖ రాజధాని అని మళ్లీ ప్రకటించారు. కానీ ఈ ప్రకటనే జగన్ పుట్టి ముంచబోతోంది.

విశాఖలో పదవి స్వీకార ప్రమాణం చేయాలన్న జగన్ కల నెరవేరడం చాలా కష్టం. ఈ విషయంలో ఉత్తరాంధ్రవాసులు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. వైసిపి అగ్రనేతల అరాచకాలతో నాలుగేళ్లుగా ఉత్తరాంధ్ర వాసులు, ముఖ్యంగా విశాఖ జనం భీతిల్లిపోయి ఉన్నారు. వైసీపీ నేతల అరాచకాలు జనంలో భయాన్ని సృష్టించాయి. దాని ఫలితంగా రాబోయే ఎన్నికల్లో ఏం చేసినా జగన్ మళ్ళీ విశాఖలో కాపురం చేసే పరిస్థితి రాకపోవచ్చు. విశాఖ రాజధాని అని అనడం కచ్చితంగా సెల్ఫ్ గోల్ వేసుకోవడమే.