ASSEMBLY ELECTIONS: మా సంగతేంటి..?.. స్కూల్ ఫీజులు.. హాస్పిటల్ బిల్లులపై ప్రశ్నిస్తున్న మిడిల్ క్లాస్..!

భారంగా మారిన స్కూలు ఫీజులు, ట్రీట్మెంట్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్న హాస్పిటల్ ఖర్చులను నియంత్రిస్తామని ఏ ఒక్క పార్టీ కూడా హామీ ఇవ్వట్లేదు. కనీసం తమ మేనిఫెస్టోల్లో కూడా చేర్చకపోవడంపై మధ్యతరగతి జనం మండిపడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 15, 2023 | 04:56 PMLast Updated on: Nov 15, 2023 | 6:49 PM

Middle Class Asking Parties About School Fees And Hospital Charges

ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికల్లో మధ్యతరగతి జనం సంగతిని అన్ని రాజకీయ పార్టీలు మర్చిపోయాయి. పేదలు, వివిధ కులాల ఓట్లే కీలకంగా తమ ప్రచారాలు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో మిడిల్ క్లాస్ పీపుల్ డిమాండ్ చేస్తున్నట్టుగా.. భారంగా మారిన స్కూలు ఫీజులు, ట్రీట్మెంట్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్న హాస్పిటల్ ఖర్చులను నియంత్రిస్తామని ఏ ఒక్క పార్టీ కూడా హామీ ఇవ్వట్లేదు. కనీసం తమ మేనిఫెస్టోల్లో కూడా చేర్చకపోవడంపై మధ్యతరగతి జనం మండిపడుతున్నారు.

MARRIAGE TROUBLES: పెళ్ళిళ్ళకు కోడ్ కష్టాలు! ఫంక్షన్ హాల్స్ దొరకట్లేదు !!

విద్య, వైద్యం.. ఈ రెండు ఖర్చులే మధ్యతరగతి జనానికి అతిపెద్ద గుదిబండలు. తమ జీతంలో 50 నుంచి 60 శాతం దాకా ఆదాయం ఈ రెండింటికే ఖర్చు చేయాల్సి వస్తోంది. స్కూళ్ళు, కాలేజీల్లో ఫీజులు నియంత్రించాలన్న డిమాండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ వస్తోంది. ఫీజుల రెగ్యులేషన్ కోసం ప్రభుత్వం కమిటీలు వేసింది. కానీ ఏనాడూ ఆ కమిటీ సిఫార్సులను ఖచ్చితంగా అమలు చేయలేదు. అదేమంటే.. సర్కారీ బడుల్లో విద్యను బలోపేతం చేస్తున్నామని చెబుతున్నారు. కానీ కేజీ టూ పీజీ ఉచిత విద్య ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో చెప్పుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. దాన్ని ఎక్కడా అమలు చేయలేదు. ఒకట్రెండు విద్యాసంస్థలు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంది. సర్కార్ నియంత్రణ కరువవడంతో ప్రతి యేటా పెరుగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులతో లక్షల కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోతున్నాయి. LKGకే రూ.30 వేల నుంచి లక్షరూపాయల దాకా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళు వసూలు చేస్తున్నాయి.

రాష్ట్రంలో ఈ అడ్డగోలు ఫీజులను ఏ మాత్రం నియంత్రించలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే.. విద్యాసంస్థల నిర్వాహకులే BRSలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పాతుకుపోయారు. ఆంధ్రాకు చెందిన కార్పొరేట్ విద్యా సంస్థల్లోనూ కొందరు అధికార పార్టీ ప్రముఖులకు వాటాలు ఉన్నట్టు ప్రచారం ఉంది. దాంతో ఎన్ని ఫిర్యాదులు వచ్చినా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు. ఇక మధ్యతరగతి జనాన్ని పీడిస్తున్న మరో సమస్య వైద్యం. కరోనా టైమ్‌లో ఈ ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎంత దారుణంగా జనాన్ని పీక్కుతిన్నాయో అందరికీ తెలుసు. రోగం వచ్చి హాస్పిటల్‌కు వెళితే టెస్టులకే లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్నామని సర్కార్ చెబుతున్నా.. ఆ బిల్లులను హాస్పిటల్స్‌కి చెల్లించడం లేదు. దాంతో ఆరోగ్యశ్రీ కార్డుదారులు, ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్యం అందించడానికి ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ ముందుకు రావడం లేదు.

REVANTH REDDY: కర్ణాటక ఫార్ములా! కాంగ్రెస్‌ గెలిచినా రేవంత్‌ సీఎం కాలేరా?

మరికొన్నయితే.. ఈ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని వంకలు పెడుతూ.. లక్షల్లో వసూళ్ళకు పాల్పడుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే 10 లక్షల రూపాయల ఉచిత వైద్యం అందిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఆ పార్టీ చెప్పినదాని కంటే ఎక్కువగా 15 లక్షల దాకా ఉచిత వైద్యం ఇస్తామని BRS చెబుతోంది. కానీ పదేళ్ళు అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్.. లక్షలు వసూలు చేసిన ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌పై చేసిన ఫిర్యాదులనే పట్టించుకోలేదు. ఉచితాల సంగతి సరే.. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో అడ్డగోలు దోపిడీని నియంత్రిస్తామని ఏ పార్టీ అయినా ఎందుకు ప్రకటించడం లేదని మిడిల్ క్లాస్ పీపుల్ ప్రశ్నిస్తున్నారు.