Nithyananda Swami : నిత్యానంద దెబ్బకు మంత్రి పదవి ఊడింది.. అసలేం జరిగిందంటే..

నిత్యానంద.. పేరు తెలియని వారు ఉండరు. వీడియోలతో ఒకసారి.. వ్యాఖ్యలతో మరోసారి.. దేశం విడిచి ఇంకోసారి.. వివాదాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. అలాంటి నిత్యానంద పేరు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. నిత్యానంద దెబ్బకు ఓ మంత్రికి పదవి ఊడిపోయింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. నిత్యానంద స్థాపించిన యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసతో ఒప్పందం చేసుకోవడంతో.. పరాగ్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 1, 2023 | 03:26 PMLast Updated on: Dec 01, 2023 | 3:26 PM

Nithyananda Swami నిత్యానంద దెబ్బకు మంత

నిత్యానంద.. పేరు తెలియని వారు ఉండరు. వీడియోలతో ఒకసారి.. వ్యాఖ్యలతో మరోసారి.. దేశం విడిచి ఇంకోసారి.. వివాదాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. అలాంటి నిత్యానంద పేరు ఇప్పుడు మళ్లీ చర్చకు వచ్చింది. నిత్యానంద దెబ్బకు ఓ మంత్రికి పదవి ఊడిపోయింది. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. నిత్యానంద స్థాపించిన యునైటెడ్ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాసతో ఒప్పందం చేసుకోవడంతో.. పరాగ్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ మధ్య.. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస ప్రతినిధులు.. జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో పాల్గొన్నారు. కైలాసతో దౌత్య సంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తానని.. కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా సపోర్ట్ ఇస్తామని పరాగ్వే వ్యవసాయ మంత్రి అర్నాల్డో చమర్రో.. అప్పట్లో ఓ ప్రకటనపై సంతకం చేశారు. ఇదే అతని కొంప ముంచింది. ఊరు లేని, అడ్రస్‌ లేని దేశంతో ఒప్పందం ఏంటి అంటూ.. పరాగ్వేలో తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

Telangana CM : తెలంగాణ కాంగ్రెస్ లో కుర్చీలాట.. రేవంత్ కి అడ్డుపడుతోంది ఎవరు ?

సోషల్‌ మీడియాలో ఈ వ్యవహారం రచ్చ రేపింది. ఈ ప్రకటన, ఒప్పందం స్కామ్ అంటూ.. నెటిజన్లు ఓ ఆటాడేసుకున్నారు. సొంత పార్టీ నుంచి కూడా అర్నాల్డోకు చేదు అనుభవమే ఎదురైంది. దీంతో చేసేదేమీ లేక, ఏమీ చేయలేక.. మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఐతే ఆ తర్వాత ఆయన అన్న మాటలే ఇప్పుడు మరింత ఆసక్తి రేపుతున్నాయి. అసలు కైలాస ఎక్కడుందో నాకు తెలియదని.. మౌలిక సదుపాయాలు, నీటి పారుదలకు సంబంధించి పరాగ్వేకు సాయం చేస్తామని కైలాస ప్రతినిధులు ముందుకు రావడంతోనే తాను సంతకం చేశానంటూ కవర్‌ చేసుకునే ప్రయత్నం చేసినా.. లాభం లేకుండా పోయింది. పరాగ్వేలోని స్థానిక మున్సిపాలిటిలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన పేపర్లను.. కైలాస సోషల్‌ మీడియా అకౌంట్‌లలో పెట్టడంతో.. తీవ్ర దుమారం రేగింది. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి.. ఒక్క సంతకం మంత్రి పదవికి ఎసరు పెట్టినట్లు అయింది. కైలాస దేశ మోసాలు.. పరాగ్వే విషయంలోనే కాదు.

గతంలో అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలోని నెవార్క్‌ మున్సిపాలిటీ అథారిటీస్‌ తోనూ ఇలాంటి బాగోతమే నడిపించారు. నెవార్క్‌ మున్సిపాలిటీ ప్రతినిధులు అప్పట్లో ప్రకటన రిలీజ్‌ చేశారు కూడా ! కైలాస దేశ ప్రతినిధులు ఇక్కడితో తమ దందా ఆపారా అంటే.. అమెరికా, కెనడాకు చెందిన స్థానిక నాయకులతోనూ ఈ దేశ ప్రతినిధులు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిత్యానందపై భారత్‌ లో అత్యాచారం సహా వివిధ ఆరోపణలు ఉన్నాయి. 2019లో ఆయన దేశం విడిచి పారిపోయారు. తర్వాత ఈక్వెడార్‌ సమీపంలోని ఓ ద్వీపంలో ఉన్నట్లు ఇంటర్‌ పోల్‌ వర్గాలు తెలిపాయి. ఆ ద్వీపానికే యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస అని పేరు పెట్టి తనని తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. కైలాసకు సొంతంగా డాలర్‌, రిజర్వ్‌ బ్యాంకు, జెండా, పాస్‌పోర్టును తీసుకొచ్చారు. ఆ తర్వాత కైలాస ప్రతినిధిగా చెబుతూ.. విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ ఏడాది ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి మీటింగ్‌కు వచ్చింది. ఆ మీటింగ్‌లోనే పరాగ్వే మంత్రి ఓ ప్రకటనపై సంతకం చేశారు. ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు.