ధోనీ ముందే కుప్పిగంతులా ? రెప్పపాటులో సూర్య స్టంపౌట్
వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ వికెట్ కీపర్ గా ధోనీ ఎప్పుడో తన మార్క్ చూపించాడు... రెప్పపాటులో స్టంపౌంట్ చేయడం... వెనుక నుంచి చూడకుండా రనౌట్ చేయడం..

వరల్డ్ క్రికెట్ లో బెస్ట్ వికెట్ కీపర్ గా ధోనీ ఎప్పుడో తన మార్క్ చూపించాడు… రెప్పపాటులో స్టంపౌంట్ చేయడం… వెనుక నుంచి చూడకుండా రనౌట్ చేయడం… బౌలర్ కు లోకల్ లాంగ్వేజ్ లో సూచనలు ఇస్తూ బ్యాటర్ ను కన్ఫ్యూజ్ చేయడం.. ఇలాంటి వికెట్ల వెనుక ధోనీ ఒక మాస్టర్ మైండ్ గా నిరూపించుకున్నాడు. అది అంతర్జాతీయ క్రికెట్ అయినా.. ఐపీఎల్ అయినా ధోనీ కీపింగ్ కు తిరుగే లేదు… అసలు ధోనీ వికెట్ల వెనుక ఉన్నాడంటే తెలివైన బ్యాటర్ ఎవ్వరూ క్రీజును సెంటీమీటర్ కూడా దాటేందుకు సాహసించరు.. ఇదంతా తెలిసి కూడా ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొంచెం అత్యుత్సాహం చూపించాడు. ఫలితంగా వికెట్ ను సమర్పించుకోవాల్సి వచ్చింది.
ధోనీ సూర్యకుమార్ యాదవ్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్టంప్ అవుట్ చేశాడు. సూర్య క్రీజు బయటకు అలా కాలు బయటపెట్టాడో లేదో ధోనీ ఇలా స్టంప్ అవుట్ చేశాడు. నలభై మూడేళ్ల వయస్సులోనూ ధోనీలో జోష్ తగ్గలేదని నిరూపించాడు. ధోనీ స్టంప్ అవుట్ చేసాక సూర్య మైండ్ బ్లాంక్ అయ్యి కాసేపు అలానే నిలబడిపోయాడు. ముంబై ఇన్నింగ్స్ 11వ ఓవర్లో మూడో బంతిని నూర్ అహ్మద్ గూగ్లీ వేశాడు. షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సూర్యకుమార్ ముందుకు వెళ్లి బంతిని మిస్ చేశాడు. ధోనీ చేతిలోకి బంతి వచ్చిన 0.12 సెకండ్లలోనే స్టంప్ చేశాడు. ధోనీ ఫాస్టెస్ట్ స్టంపింగ్లలో ఇది కూడా ఒకటి. కాకపోతే ఈ వయస్సులో కూడా బంతిని అంత వేగంగా తీసుకుని వికెట్లకు కొట్టడంతో తల ఫ్యాన్స్ నెట్టింట ఫుల్ జోష్లో ఉండిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీంతో ధోనీని వెనకాల పెట్టుకుని కుప్పిగంతులా సూర్యాభాయ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలోనూ ధోనీ కెరీర్ లో బెస్ట్ స్టంపింగ్స్ చాలానే ఉన్నాయి. భారత్-వెస్టిండీస్ మధ్య 2018లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో కీమో పాల్ని అత్యంత తక్కువ సమయంలో స్టంప్ అవుట్ చేశాడు. జడేజా ఓవర్లో క్రీజు బయటకు వెళ్లి ఆడేందుకు ప్రయత్నించిన కీమో పాల్ని కేవలం 0.08 సెకండ్లలోనే స్టంప్ అవుట్ చేశాడు. భారత్-ఆస్ట్రేలియా మధ్య 2012లో జరిగిన టీ20 సిరీస్లో కూడా ధోనీ మెరుపు వేగంతో స్టంపింగ్ చేశాడు. రాహుల్ శర్మ వేసిన బంతిని ఆస్ట్రేలియా ఆటగాడు మిచ్ మార్ష్ మిస్ చేయగా ధోనీ 0.09 సెకండ్లలో స్టంప్ అవుట్ చేశాడు. 2018 టీ20 బ్లాస్ట్లో బెన్ కాక్స్ కేవలం అలా క్రీజుకి కాస్త ముందుగా కాలు జరిపాడో లేదో వెనక్కి పెట్టేలోపే ధోనీ స్టంప్ అవుట్ చేశాడు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో శుభమన్ గిల్ను మెరుపు వేగంతో అవుట్ చేసి 41 ఏళ్ల వయస్సులో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
2019 వన్డే వరల్డ్కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోనీ ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. సీఎస్కే ఫ్యాన్స్ కోసమే 43 సంవత్సరాలలో కూడా గ్రౌండ్లోకి వస్తున్నాడు. వేలానికి ముందే చెన్నై ఫ్రాంచైజీ మహిని అన్ క్యాప్డ్ కేటగిరీలో రిటైన్ చేసుకుంది. కాగా ముంబైతో జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై 4 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది.