శ్రేయాస్ ను పట్టించుకో, గంభీర్ కు దాదా రిక్వెస్ట్
ఐపీఎల్ 18వ సీజన్ లో పలువురు స్టార్ ప్లేయర్స్ పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ ఆటగాళ్ళు సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశమే..

ఐపీఎల్ 18వ సీజన్ లో పలువురు స్టార్ ప్లేయర్స్ పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ ఆటగాళ్ళు సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశమే.. ఈ నేపథ్యంలో గత ఏడాదంతా జట్టుకు దూరమై ఛాంపియన్స్ ట్రోఫీతో రీఎంట్రీ ఇచ్చిన శ్రేయాస్ అయ్యర్ మళ్ళీ టీమిండియాలో తన ప్లేస్ సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ తరఫున తొలి మ్యాచ్లో అద్భుతమైన పవర్ హిట్టింగ్తో తన సత్తా చాటుకున్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంలో శ్రేయల్ 42 బంతుల్లో 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో కీలక పాత్ర పోషించాడు. 5 ఫోర్లు, 9 సిక్సర్లతో చెలరేగిన శ్రేయస్ తన జట్టుకు భారీస్కోర్ అందించాడు.ఈ క్రమంలో సెంచరీ గురించి కూడా ఆలోచించకుండా గొప్ప నాయకుడు అనిపించుకున్నాడు. తాజాగా శ్రేయస్ ఇన్నింగ్స్ పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు.
గత ఏడాది కాలంలో బ్యాటర్ గా శ్రేయస్ అయ్యర్ ఎంతో మెరుగయ్యాడని గంగూలీ ప్రశంసించాడు. మూడు ఫార్మాట్లకు రెడీగా ఉన్నాడని అంచనా వేశాడు. శ్రేయస్ ను టెస్టు, టీ20ల్లోనూ ఆడించేలా గంభీర్ చొరవ చూపాలనే అర్థం వచ్చేలా బీసీసీఐని గంగూలీ ట్యాగ్ చేశాడు. లెంగ్త్ విషయంలో కొన్ని సమస్యల తర్వాత అతని ఇంప్రూవ్ మెంట్ చూడటం గొప్పగా ఉందంటూ దాదా ఎక్స్ లో పోస్ట్ చేశాడు. టీమిండియా వన్డే జట్టులో కీలక ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ కొనసాగుతున్నాడు. కానీ టెస్టులు, టీ20ల్లోకి వచ్చే సరికి మాత్రం అతణ్ని పట్టించుకోవడం లేదు. గత ఏడాది తన కెరీర్ లో శ్రేయస్ చాలా ఒడుదొడుకులు చూశాడు. జాతీయ జట్టులో చోటు కోల్పోవడమే కాదు.. బీసీసీఐ చెప్పినా దేశవాళీ క్రికెట్లో ఆడలేదని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి వేటు తప్పలేదు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ను విజేతగా నిలిపినా శ్రేయస్ కష్టాన్ని ఎవరూ గుర్తించలేదు. అయితే కిందపడ్డ ప్రతిసారి బలంగా పైకి లేచి శ్రేయస్ మరోసారి అలాగే పుంజుకున్నాడు. 2023/24 సీజన్లో ముంబయిని రంజీ టైటిల్ దిశగా నడిపించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఏడాది ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ లో కోహ్లి గాయం కారణంగా వచ్చిన ఛాన్స్ ను శ్రేయస్ వదల్లేదు.
అదే ఊపులో ఛాంపియన్స్ ట్రోఫీలోనూ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఐపీఎల్ కొత్త ప్రయాణం స్టార్ట్ చేశాడు. తొలి మ్యాచ్ లోనే అజేయంగా 97 పరుగులతో సత్తాచాటాడు. ఈ క్రమంలో టీ ట్వంటీ క్రికెట్ లో 6 వేల పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. 218 ఇన్నింగ్స్ల్లో 6,071 రన్స్తో ఈ ఘనత సాధించిన 15వ భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాల సరసన చోటు సంపాదించాడు. గతంలో కోల్కతా నైట్ రైడర్స్కు టైటిల్ సాధించి పెట్టిన ఈ ముంబై బ్యాటర్ ఇప్పుడు పంజాబ్కు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. కెప్టెన్సీలోనూ తనదైన ముద్ర వేశాడు. పంజాబ్ కింగ్స్ తన తర్వాతి మ్యాచ్ లో ఏప్రిల్ 1న లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది.