పాక్ క్రికెట్ బోర్డు అక్కసు కనిపించని భారత్ జెండా
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరో రెండురోజుల్లో ఆరంభం కానుంది. పాకిస్థాన్ ప్రధాన ఆతిథ్య దేశమే అయినప్పటకీ భారత్ అక్కడికి వెళ్ళేందుకు నిరాకరించడంతో మన మ్యాచ్ లను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరో రెండురోజుల్లో ఆరంభం కానుంది. పాకిస్థాన్ ప్రధాన ఆతిథ్య దేశమే అయినప్పటకీ భారత్ అక్కడికి వెళ్ళేందుకు నిరాకరించడంతో మన మ్యాచ్ లను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు. దీని ప్రకారం దుబాయ్ లో భారత్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు పాక్ క్రికెట్ బోర్డు అత్యుత్సాహంతో కొత్త వివాదం మొదలైంది. ఒకవిధంగా పీసీబీనే ఉద్దేశపూర్వంగా ఈ వివాదానికి కారణమైంది. కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంపై భారత జెండా లేకుండానే ప్రారంభ వేడుకలకు సిద్ధమైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే అన్ని దేశాల జాతీయ పతాకాలు స్టేడియంలో ఎగురవేయడం ఆనవాయితీ. మొత్తం ఎనిమిది దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటుండగా.. భారతదేశ జాతీయ పతాకం మినహా మిగతా అన్ని దేశాల జెండాలు కనిపించాయి. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు.
కరాచీ స్టేడియంలోఏర్పాటు చేసిన ఈవెంట్లో ఇండియన్ ఫ్లాగ్ మిస్సయినట్లు కొందరు గమనించారు. వెంటనే అక్కడ ఉన్న మిగతా ఏడు దేశాల జాతీయ జెండాల వీడియోను నెట్టింట పోస్ట్ చేశారు. పాకిస్తాన్ ఉద్దేశ పూర్వకంగానే భారతదేశ త్రివర్ణ పతాకాన్ని కరాచీ స్టేడియంపై ఎగురవేయలేదని టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపిస్తూ పాకిస్థాన్లో పర్యటించేందుకు బీసీసీఐ అభ్యంతరం చెప్పడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేలా పీసీబీని ఐసీసీ ఒప్పించింది. ఈ క్రమంలో బీసీసీఐ-పీసీబీల మధ్య ఓ ఒప్పందం జరిగింది. భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని పీసీబీ కోరగా.. అందుకు బీసీసీఐ కూడా అంగీకరించింది. అంతేకాకుండా నష్టపరిహారంగా పీసీబీకి ఐసీసీ.. ఓ మెగా టోర్నీని కూడా కేటాయించింది. టోర్నీ నిర్వహణ బడ్జెట్ కూడా పెంచింది. దాంతో భారత్ మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు పీసీబీ ఒప్పుకుంది.
ఇంత చేసినా భారత్పై పీసీబీ తన అక్కసు వెళ్లగక్కింది. కరాచీ స్టేడియంలో అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించిన పీసీబీ.. భారత దేశ పతాకాన్ని మాత్రం పక్కనపెట్టింది. తమ దేశంలో పర్యటించడం లేదనే సాకుతోనే భారత జెండా ప్రదర్శించకుండా పీసీబీ ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది.ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్ తమ నీచ బుద్దిని బయటపెట్టుకుందని, వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భారత జెండాను ప్రదర్శించకపోతే.. టోర్నీని బహిష్కరించాలని కూడా బీసీసీఐకి సూచిస్తున్నారు. భారత్ జెండా ప్రదర్శన చేయకపోవడానికి గల కారణాలను పీసీబీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆ దేశ జర్నలిస్ట్లు, నెటిజన్లు మాత్రం.. ఇది ప్రతీకార చర్యగానే పేర్కొంటున్నారు.