Jaiswal: రైనా రికార్డు బద్దలు.. 13 ఏళ్ల చరిత్రకు జైస్వాల్ సెగ

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శనతో ఈ టెస్టును కేవలం మూడు రోజుల్లోనే ముగించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 15, 2023 | 01:32 PMLast Updated on: Jul 15, 2023 | 1:32 PM

Jaiswal Broke Suresh Rainas Record As The Highest Run Scorer On Foreign Soil In Test Debut

భారత్‌ విజయంలో అశ్విన్‌ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ 7 వికెట్లతో చెలరేగడంతో కేవలం 130 పరుగులకే విండీస్‌ కుప్పకూలింది. ఇక ఇది ఇలా ఉండగా.. టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ తన అరంగేట్ర టెస్టులోనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి టెస్టులోనే సెంచరీ సాధించిన ఈ యువ కెరటం అందరి మన్ననలు పొందుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 387 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 171 పరుగులు చేశాడు. భారత జట్టు విజయంలో జైశ్వాల్‌ కూడా ముఖ్య పాత్ర పోషించాడు. ఇక అరంగేట్రం చేసిన తొలి టెస్ట్ లోనే సెంచరీతో చెలరేగిన యశస్వీ జైశ్వాల్‌ పలు రికార్డులు కొల్లగొట్టాడు.

ఈ క్రమంలో మరో అరుదైన ఘనతను ఈ యువ ఓపెనర్‌ తన పేరిట లిఖించుకున్నాడు. డెబ్యూ టెస్టులోనే విదేశీ గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు సురేష్‌ రైనా పేరిట ఉండేది. రైనా శ్రీలంకపై తన అరంగేట్ర టెస్టులో 120 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌లో 171 పరుగులు చేసిన జైశ్వాల్‌ 13 ఏళ్ల రైనా రికార్డును బ్రేక్‌ చేశాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచక్రికెట్‌లో ఈ ఘనత సాధించిన జాబితాలో జైశ్వాల్‌ ఐదో స్ధానంలో నిలిచాడు. కాగా విండీస్‌-భారత్‌ మధ్య రెండో టెస్టు ట్రినిడాడ్‌ వేదికగా జూలై 20 నుంచి ప్రారంభం కానుంది.