Paris Olympics Manu Bhakar : ఒలింపిక్‌ మెడలిస్ట్‌.. మను భాకర్‌ బ్యాగ్రౌండ్‌.. ఈ స్టోరీతో ఓ సినిమా తీయొచ్చు!

మను భాకర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఎవరిని కదిలించినా.. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ను చూసినా ఆమె గురించే చర్చ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 29, 2024 | 01:45 PMLast Updated on: Jul 29, 2024 | 1:45 PM

Manu Bhakar Gave India Its First Medal In Paris Olympics 2024

మను భాకర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఎవరిని కదిలించినా.. ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌ను చూసినా ఆమె గురించే చర్చ. దేశ ప్రధాని నుంచి సామన్య పౌరుడి వరకు ఆమెకు సలాం చేస్తున్నవారే. పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్‌కు తొలి పతకం అందించి బోణీ కొట్టించింది మను భాకర్‌. షూటింగ్ ఈవెంట్‌లో మెడల్ సాధించిన తొలి భారత షూటర్‌గా నిలిచి.. 130 కోట్ల మంది గర్వపడేలా చేసింది. 20 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్‌లో ఫైనల్‌కి చేరి అందరి దృష్టిని ఆకర్షించిన మను భాకర్.. ఆదివారం మెడల్ ఈవెంట్‌లోనూ అదే జోరును కొనసాగించి విశ్వవేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించింది. ఫైనల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని అందుకుంది.

ఈ విజయంతో మను భాకర్ టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అసలు ఎవరీ మను భాకర్‌.. ఏంటి ఈమె బ్యాగ్రౌండ్ అని సెర్చ్‌ చేస్తున్నారు. హరియాణాకు చెందిన మను భాకర్ 2002లో ఫిబ్రవరి 18న జన్మించింది. ఆమె తండ్రి మెరైన్ ఇంజనీర్ కాగా.. తల్లి ప్రిన్సిపాల్. చిన్న వయసులోనే షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న మను భాకర్.. జస్పాల్ రాణా పర్యవేక్షణలో ఓనమాలు నేర్చుకుంది. ఇప్పటికీ అతని కోచింగ్‌లోనే ఆడుతోంది. టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం వేరే కోచ్‌తో బరిలోకి దిగిన మను భాకర్.. తిరిగి ఆయన్నే కోచ్‌గా ఎంచుకుంది. 2017లో కేరళలో జరిగిన నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో 9 బంగారు పతకాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది మనూ భాకర్. 16 ఏళ్ల వయసులోనే 2018 కామన్వెల్త్ గేమ్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. 2018 యూత్ ఒలింపిక్స్‌లోనూ బంగారు పతకం సాధించిన మను భాకర్.. 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించింది.

ఆమె విజయాలను గుర్తించిన భారత ప్రభుత్వం అర్జున అవార్డ్‌తో సత్కరించింది. 19 ఏళ్ల వయసులోనే భారీ అంచనాలతో టోక్యో ఒలింపిక్స్‌ బరిలో నిలిచిన మను భాకర్ తీవ్రంగా నిరాశపరిచింది. ఆమె పిస్టోల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య ఫైనల్ చేరుకుండా చేసింది. పిస్టల్‌ను రిపేర్ చేసే సరికి ఆమె 6 నిమిషాల సమయాన్ని కోల్పోయింది. అప్పటికే ఇతర అథ్లెట్లు ముందుకు దూసుకుపోగా.. మను భాకర్ 2 పాయింట్ల తేడాతో ఓడి కన్నీటి పర్యంతమైంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఏ ఈవెంట్‌లో కూడా మను భాకర్ ఫైనల్‌కు అర్హత సాధించలేదు. ఈ ఓటమితో గుణపాఠం నేర్చుకున్న మను.. పారిస్ ఒలింపిక్స్‌కు అన్ని విధాల సిద్దమై బరిలోకి దిగింది. ఆడిన తొలి ఈవెంట్‌లోనే పతకంతో మెరిసింది. షూటింగ్ విభాగంలో భారత్‌కు ఇది ఐదో ఒలింపిక్ మెడల్ కాగా.. తొలి మహిళా షూటర్‌గా మను భాకర్ చరిత్రకెక్కింది.

2004 అథెన్స్ ఒలింపిక్స్‌లో రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సిల్వర్ మెడల్ సాధించగా.. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా బంగారు పతకం సాధించాడు. 2012 రియో ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్ సిల్వర్, గగన్ నారంగ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక్క మెడల్ కూడా రాలేదు. తాజాగా పారిస్ ఒలింపిక్స్‌లో మను భాకర్ కాంస్యంతో మెరిసింది. ఈ ఒలింపిక్స్‌లో మను భాకర్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌తో పాటు, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లలో పోటీపడుతోంది. ఇతర షూటర్లు సైతం మెడల్స్ గెలిచే అవకాశం ఉంది. భగవద్గీత నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని విజయానంతరం మను భాకర్ తెలిపింది. ‘నేను చాలా సార్లు భగవద్గీత చదివాను. ఫైనల్ రౌండ్స్‌కు ముందు కూడా భగవద్గీతలోని సూక్తిని మనసులో అనుకున్నాను. ఫలితం గురించి ఆలోచించకుండా పని చేయాలనే విషయాన్ని గట్టిగా నమ్మాను. ఫలితం గురించి ఆలోచించకుండా ఫోకస్ అంతా నా ప్రక్రియపైనే పెట్టాను. భగవద్గీత చదివితే పాజిటీవ్ ఎనర్జీ వస్తుంది. కర్మ సిద్దాంతాన్ని, విధి రాతను ఎవరూ మార్చలేరనే విషయాన్ని నేను బలంగా నమ్ముతాను.” అని మను భాకర్ చెప్పుకొచ్చింది. ఆమె సాధించిన విజయంతో పాటు ఆమె చెప్పిన ఈ మాటలు ఇప్పుడు యూత్‌ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి.