ఛాంపియన్ కెప్టెన్ ఎంట్రీ పంజాబ్ రాత మారేనా ?

ఐపీఎల్ మొదలై 17 ఏళ్ళు పూర్తయింది... ఇప్పుడు 18వ సీజన్ మొదలుకాబోతోంది.. ఇప్పటి వరకూ లీగ్ లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ముందుంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 17, 2025 | 02:36 PMLast Updated on: Mar 17, 2025 | 2:36 PM

Will The Entry Of The Champion Captain Change The Script Of Punjab

ఐపీఎల్ మొదలై 17 ఏళ్ళు పూర్తయింది… ఇప్పుడు 18వ సీజన్ మొదలుకాబోతోంది.. ఇప్పటి వరకూ లీగ్ లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ముందుంటుంది. స్టార్ ఆటగాళ్ళు ఉన్నా… కెప్టెన్లు మారినా… పంజాబ్ టైటిల్ కల మాత్రం నెరవేరడం లేదు. 2014లో ఫైనల్ కు చేరడమే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. ఎప్పటికప్పుడు అంచనాలతో బరిలోకి దిగినా పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండు మూడు స్థానాలకే పరిమితమవుతూ వస్తోంది.గతేడాది కేవలం ఐదు విజయాలతో తొమ్మిదో స్థానంతో సరిపెట్టింది. కానీ, ఐపీఎల్ 18వ ఎడిషన్‌‌కు ముందు పంజాబ్‌‌ తమ టీమ్‌‌ను పూర్తిగా మార్చేసుకుంది. అందరికంటే ఎక్కువగా 110.5 కోట్లతో మెగా వేలానికి వెళ్లిన పంజాబ్ దేశ, విదేశాలకు చెందిన టాప్ క్లాస్ టీ20 క్రికెటర్లను తమ జట్టులోకి తెచ్చుకుంది. గత సీజన్‌‌లో కేకేఆర్‌‌‌‌కు ట్రోఫీ అందించిన శ్రేయస్ అయ్యర్‌‌ను ఏకంగా 26.75 కోట్లతో కొనుగోలు చేసింది. అతనికే కెప్టెన్సీ అప్పగించింది.

స్టోయినిస్‌‌, మ్యాక్స్‌‌వెల్‌‌, యుజ్వేంద్ర చహల్‌‌, మార్కో జెన్సన్ వంటి మేటి స్టార్లను జట్టులోకి తీసుకున్న పంజాబ్‌‌ ఈసారైనా కప్పుకొట్టాలని ఆశిస్తోంది. ఈ సీజన్‌‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టుకు అతి పెద్ద బలంగా కానున్నాడు. బ్యాటర్‌‌‌‌గానే కాకుండా అతని కెప్టెన్సీ ఆ జట్టుకు అడ్వాంటేజ్ కానుంది . శ్రేయస్‌‌కు తోడు స్టోయినిస్‌‌, మ్యాక్స్‌‌వెల్‌‌, నేహల్ వాధెర, ప్రభ్‌‌సిమ్రన్ సింగ్‌‌, జోష్ ఇంగ్లిస్ వంటి టీ20 హిట్టర్లతో బ్యాటింగ్‌‌ విభాగం పటిష్టంగా ఉంది. అర్ష్‌‌దీప్ సింగ్‌‌తో పాటు మార్కో జెన్సన్‌‌, కుల్దీప్ సేన్‌‌, ఆరోన్‌‌ హార్డీ, లోకీ ఫెర్గూసన్‌‌ రూపంలో పవర్ ఫుల్ పేసర్లు ఉన్నారు. దాంతో పంజాబ్ బౌలింగ్‌‌ను ఎదుర్కోవడం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాల్ గానే చెప్పాలి. అయితే స్పిన్ విభాగంలోనే పంజాబ్ బలహీనంగా కనిపిస్తోంది. యుజ్వేంద్ర చహల్‌‌కు తోడుగా మరో క్వాలిటీ స్పిన్నర్ లేకపోవడం జట్టుపై ప్రభావం చూపనుంది.

హర్‌‌‌‌ప్రీత్ సింగ్‌‌పై పెద్దగా అంచనాలు లేవు. దాంతో ఆల్‌‌రౌండర్ మ్యాక్స్‌‌వెల్ స్పిన్ భారాన్ని పంచుకోవాల్సి ఉంటుంది. జట్టులో చాలా మంది టాప్ క్లాస్ బ్యాటర్లు ఉన్నా.. ఓపెనింగ్‌‌ కాంబినేషన్‌‌, మిడిలార్డర్‌‌‌‌పై క్లారిటీ లేదు. అదే సమయంలో తుది జట్టు ఎంపిక క్లిష్టంగా మారనుంది. అదే సమయంలో అదరగొట్టే డొమెస్టిక్ బ్యాటర్లు లేకపోవడం కూడా మైనస్ గా మారే అవకాశముంది. గత ఏడాది కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి వెలుగులోకి వచ్చిన శశాంక్‌ సింగ్‌ ఈసారి ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.

గత కొన్ని సీజన్లుగా పంజాబ్ కు ఉన్న బలహీనత సమిష్టిగా ఆడలేకపోవడమే..ఈ లోపాన్ని శ్రేయస్‌ ఎంతవరకు సరిదిద్ది జట్టును ముందుకు నడిపిస్తాడో చూడాలి. కాగితం మీద విదేశీ బలానికి లోటు లేనట్లు కనిపిస్తున్నా.. మైదానంలో ప్రదర్శన ఎలా ఉంటుందో చెప్పలేం. ముఖ్యంగా కొన్నేళ్లుగా లీగ్‌లో పేలవ ప్రదర్శన చేస్తున్న మ్యాక్స్‌వెల్‌ తన పాత జట్టే అయిన పంజాబ్‌ తరఫున ఏమాత్రం సత్తా చాటుతాడన్నది చూడాలి. పంజాబ్ పూర్తిగా కొత్త కూర్పుతోనే బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌‌గా శ్రేయస్‌‌, కోచ్‌‌గా రికీ పాంటింగ్‌‌ ఉండటంతో జట్టుపై సహజంగానే అంచనాలు పెరిగాయి. ఫారిన్ ప్లేయర్స్ అంచనాలకు తగ్గట్టు రాణిస్తే శ్రేయాస్ కెప్టెన్సీ పంజాబ్ రాత మారే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.